ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కూడా, బాధ్యతలు మరిచి ప్రవర్తిస్తే ప్రశ్నిస్తామని జనసేనాని చెపుతూనే ఉన్నారు. కొత్తగా ఏపీలో ఏర్పడిన ప్రభుత్వం పనితీరుపై కొంత సమయం అనంతరం ప్రశ్నిస్తామని పవన్ అన్నారు. అయితే ఈ లోపే, భవన నిర్మాణ కార్మికుల బాధలు చూసిన తర్వాత సంయమనం పాటించలేకపోతున్నామని, అందుకే లేఖ రాస్తున్నానని వెల్లడించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్ ను ఉద్దేశిస్తూ పవన్ లేఖ రాశారు. రాష్ట్రంలో ఇసుక కొరత వల్ల నిర్మాణాలు కుంటుపడ్డాయని, భవన నిర్మాణ కార్మికులు పనిలేక పస్తులుంటున్నారని పవన్ తన లేఖలో పేర్కొన్నారు.
భవన నిర్మాణ కార్మికులు స్వయంగా తమవద్దకు వచ్చి మరీ వారి సాధకబాధకాలు వ్యక్తపరిచి కన్నీటి పర్యంతమయ్యారని వెల్లడించారు. రాష్ట్రంలో నూతన ఇసుక విధానం ప్రకటించడానికి ప్రభుత్వం సెప్టెంబరు 5 వరకు ఆగాల్సిన అవసరం ఏంటని పవన్ తన లేఖలో ప్రశ్నించారు. అప్పటివరకు కూలి పనులు చేసుకునేవాళ్లు ఏమైపోవాలంటూ నిలదీశారు. ఇలాంటి కష్టకాలంలో భవన నిర్మాణ కార్మికులను ప్రభుత్వమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజల ఆకలి బాధలు ప్రభుత్వానికి ఏమంత మంచిది కాదన్నారు.