కేంద్రం ఆమోదించిన పౌరసత్వ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఢిల్లీ కేంద్రంగా అల్లర్లు చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ కేసును విచారించిన పోలీసులు గతంలోనే విద్యార్థి సంఘం పూర్వపు నేత ఉమర్ ఖలీద్ పై ఎఫ్ఐఆర్ ను నమోదు చేశారు. తాజాగా ఉమర్ ఖలీద్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ నేపథ్యంలో బీజేపీ నేత కపిల్ మిశ్రా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ అల్లర్లలో ప్రమేయం సహా దేశద్రోహం అభియోగాలపై అరెస్ట్ అయిన ఉమర్ ఖలీద్ ను ఉరి తీయడం ఖాయమని అన్నారు. ఉమర్ ను అదుపులోకి తీసుకున్న ఢిల్లీ పోలీసులను అభినందించిన ఆయన, ఓ వీడియో మెసేజ్ ని విడుదల చేశారు. తాహిర్ హుస్సేన్, ఉమర్ ఖలీద్ వంటి వారిని ఉరి తీయడం ఖాయమని తాను భావిస్తున్నట్టు ఈ వీడియోలో పేర్కొన్నారు.
ఈ సంవత్సరం ఫిబ్రవరిలో జరిగిన ఢిల్లీ అల్లర్లు, ముంబైపై జరిగిన ఉగ్రదాడితో సమానమని ఆయన అభివర్ణించడం గమనార్హం. ఇది ఉగ్రవాదులు ఓ పథకం ప్రకారం చేసిన కుట్ర తరువాత జరిగిన దాడులని తెలిపారు.
దాడులకు ఉమర్, తాహిర్ తదితరులే కారణమని కపిల్ మిశ్రా ఆరోపించారు. ఎన్నో దుకాణాలను ధ్వంసం చేయడంతో పాటు, ప్రజలను చంపేందుకు వీరు చూశారని ఆరోపించారు. ఈ నేరానికి జీవిత ఖైదు లేదా ఉరి ఖాయమని కపిల్ మిశ్రా వ్యాఖ్యానించారు.