పంచాయతీ కార్యాలయాల రంగులపై జగన్ సర్కార్ వెనక్కి తగ్గింది. వెంటనే రంగులు మార్చాలని పంచాయతీలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అన్ని కార్యాలయాలకు తెలుపు రంగు మాత్రమే వేయాలని సూచించింది. సీఎం జగన్ బొమ్మ తప్పనిసరిగా ఉండాలని ఆదేశాలిచ్చింది. భవనాలపై ఉన్న నీలం, ఆకుపచ్చ రంగుల్ని వెంటనే తొలగించాలని ఆదేశాల్లో పేర్కొంది. 14వ ఆర్థిక సంఘం నుంచి నిధులు ఖర్చు చేయాలని ఆదేశాల్లో తెలిపింది.
జగన్ సర్కార్ తాజా నిర్ణయంపై టీడీపీ సీనియర్ నేత వర్లరామయ్య స్పందించారు. వైసీపీ ప్రభుత్వానికి తలకెక్కిన మత్తు ఇప్పటికి దిగిందని వ్యాఖ్యానించారు. ఇది ప్రజాస్వామ్య విజయంగానే భావించాలన్నారు. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం సీఎం బొమ్మ వేయడానికి వీల్లేదని అన్నారు. సీఎం బొమ్మ తీసేయాలని ఎవరో ఒకరు కోర్టుకు వెళ్తారని అన్నారు.