తెలంగాణ వచ్చినప్పటి నుంచి బ్లాక్ మెయిల్ రాజకీయాలు నడుస్తున్నాయని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆరోపించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో మిలియన్ మార్చ్ ఎలా జరిగిందో ఆర్టీసీ జాక్ ట్యాంక్ బండ్ కార్యక్రమం కూడా అలాగే జరుగుతుందని కాంగ్రెస్ జగ్గారెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఆర్టీసీ కార్మికుల పోరాటానికి ప్రజలు మద్దతు ఇవ్వాలని చెప్పారు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోకున్నా, న్యాయస్థానం ద్వారా న్యాయం జరుగుతుందని జగ్గారెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. పోలీసులు రాష్ట్రంలో భయాన్ని సృష్టిస్తున్నారని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా.. పోలీసులు భయాందోళనకు గురిచేస్తున్నారని విమర్శించారు. పోలీసు అధికారులు జాగ్రత్త వహించాలని, ఎల్లకాలం కేసీఆర్ కుటుంబమే అధికారంలో ఉండదని అన్నారు.