ఇటీవల భారత్లో పలు సమస్యలపై ఆందోళనకర పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో వివిధ దేశాలు తమ పౌరులకు ట్రావెల్ అడ్వయిజరీలు జారీ చేస్తున్నాయి. ఆ జాబితాలో తాజాగా అస్ట్రేలియా కూడా చేరింది. భారత్ పర్యటనకు వెళ్ళే వారు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆ దేశం తమ పౌరులకు సూచించింది. ఈ మేరకు మంగళవారం విదేశీ వ్యవహారాల విభాగం పలు సూచనలతో కూడిన ట్రావెల్ అడ్వయిజరీ విడుదల చేసింది. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా భారత్లో ఆందోళనలు జరుగుతున్నాయని, కొన్ని ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని, జాగ్రత్తగా ఉండాలని తెలిపింది. ప్రధానంగా ఢిల్లీ, అసోం, మేఘాలయ, త్రిపుర, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్, తెలంగాణల్లో నిరసనలు తీవ్రంగా ఉన్నాయని పేర్కొంది. పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు కూడా చోటుచేసుకున్నాయని వెల్లడించింది.
ఈ సమయంలో పర్యాటకులే లక్ష్యంగా ఎక్కడైనా దాడులు జరిగే ప్రమాదం ఉందని, స్థానిక అధికారుల సూచనలు పాటించాలని హెచ్చరించింది. భారత్, పాక్ సరిహద్దులో ఉన్న జమ్ముకాశ్మీర్ ప్రాంతాలకు అసలు వెళ్లదని సూచించింది. సిఎఎకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా తీవ్రరూపంలో నిరసనలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. దీంతో అమెరికా, యుకె, సింగపూర్, కెనడా, ఫ్రాన్స్, ఇజ్రాయిల్ దేశాలు ఇటీవల తమ పౌరులను హెచ్చరించాయి. భారత్ వెళ్లేందుకు ఇది సమయం కాదని తెలిపాయి. ఇప్పటికే వెళ్లిన వారు అప్రమత్తంగా ఉండాలని సూచించాయి.