కేంద్రంలో బీజేపీ సొంతంగానే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందనికేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం ఓ వార్తాఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్, ఒడిసా రాష్ట్రాల్లో అధిక సీట్లు సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. గత ఐదేళ్లలో చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో ఎన్నికలకు వెళ్లామని చెప్పుకొచ్చారు. సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొంది నరేంద్ర మోదీ మరోసారి ప్రధాని పదవి చేపడతారని జోస్యం చెప్పారు.
మోదీ ప్రభుత్వం పట్ల ప్రజల్లో ఎన్నో ఆశలున్నాయని చెప్పారు. గడ్కరీ కాంగ్రెస్ పార్టీ తమకు శత్రువు కాదని, ఇరు పార్టీల మధ్య సైద్ధాంతిక విభేదాలున్నాయని అన్నారు. బ్యాంకింగ్, ఆర్థిక వ్యవస్ధలను మెరుగుపరిచేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. ప్రధానిని దొంగ అనడం సరికాదని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీని ఉద్దేశించి గడ్కరీ దుయ్యబట్టారు. ప్రధాని పదవికి తాను రేసులో లేనని గడ్కరీ స్పష్టం చేశారు.