ఏపీ రాజధాని అమరావతి నుంచి తరలిపోవడం జరగని పని అని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు స్పష్టం చేశారు. రాజధాని అంశంపై ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. రైతు సంఘాలు ఎంతో సమర్థులైన న్యాయవాదులను నియమించుకున్నాయని తెలిపారు. రైతులకు నూటికి నూరుపాళ్లు న్యాయం జరిగి తీరుతుందని అన్నారు.
తాజాగా ఏపీ ప్రభుత్వం కేంద్రానికి పంపిన ప్రతిపాదనల్లో రాజధాని నిర్మాణం పూర్తి చేయడం కోసం రూ.60 వేల కోట్లు అడగడం చిగురంత ఆశ రేకెత్తిస్తోందని అన్నారు. సీఎం జగన్ హృదయం కూడా కరుగుతోందేమో అనిపిస్తోందని రఘురామకృష్ణరాజు అభిప్రాయపడ్డారు.
జగదేకవీరుని కథ సినిమాలో ఐదుగురు ఎన్టీ రామారావులు వచ్చి పాట పాడినప్పుడు కఠిన శిల కూడా కరుగుతుందని అలాగే రాజధాని రైతుల ఆక్రందనలు కూడా సీఎం జగన్ చెవికి ఆలస్యంగా చేరతాయని చెప్పారు. అమరావతినే రాజధానిగా కొనసాగిస్తారన్న ప్రగాఢ విశ్వాసం తనకు కలుగుతోందని ఆయన పేర్కొన్నారు.