వైసీపీ అధినేత జగన్ భారీ ఆధిక్యంతో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. 175 నియోజకవర్గాల్లోనూ జగన్ సునామీ కారణంగా 151 స్థానాల్లో విజయం సొంతం చేసుకున్నారు. ఇప్పుడు జగన్.. మరింత వ్యూహాత్మకంగా వ్యవహరించి టీడీపీని అసలు కోలుకోకుండా చేయాలని నిర్ణయించారు. ఓడిన ప్రాంతాలపై కూడా ఆయన ప్రత్యేక శ్రద్ద పెట్టినట్టు తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఆయన తాజాగా కొత్త వ్యూహానికి పదును పెంచారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో 24 నియోజకవర్గాల్లో వైసీపీ ఓటమి పాలైంది. వీటిలో 23 టీడీపీ దక్కించుకోగా, ఒకటి మాత్రం జనసేన బోణీ చేసింది. ఇప్పుడు జగన్ ఈ నియోజకవర్గాలపైనే దృష్టి పెట్టారు. ఇక్కడ పట్టు పెంచుకునేందుకు ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. త్వరలోనే ఆయా నియోజకవర్గాల్లో ఇంచార్జులను మార్పు చేసి, వారికి నిధులు ఇవ్వాలని నిర్ణయించినట్టు సమాచారం.
అసెంబ్లీలో ప్రకటించిన విధంగా ఎమ్మెల్యేకు రూ.కోటి ఇవ్వడంతో పాటు వైసీపీకి పట్టులేని నియోజకవర్గాల్లో వైసీపీ ఇంచార్జులకు కూడా అంతే మొత్తంలో నిధులు కేటాయించాలని నిర్ణయించినట్టు సమాచారం. ఒక పక్క ఎమ్మెల్యేకు నిధులు ఇస్తూనే.. ఇంచార్జులకు ఇచ్చే నిధుల ద్వారా మరింతగా ఆయన నియోజకవర్గాల్లో పనులు చేపట్టేందుకు, గ్రామాల్లో కార్యక్రమాల రూపకల్పనకు అవకాశం కల్పించాలని నిర్ణయించారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో కీలకమైన స్పందన కార్యక్రమానికి వస్తున్న దరఖాస్తుల విషయంలో ఈ 24 నియోజకవర్గాల్లో అక్కడి ఎమ్మెల్యేలు చేసినా చేయకున్నా.. ప్రబుత్వం తరఫున ఆయా సమస్యలు తీర్చేందుకు కూడా జగన్ నిధులు విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ నియోజకవర్గాల్లో అభివృద్ధిని చేసి చూపించడం ద్వారా.. ప్రజలకు చేరువ కావాలని నిర్ణయించుకున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి .