నిర్భయ ఆత్మకు శాంతి చేకూరిందని నిర్భయ తల్లి ఆశాదేవి అన్నారు. ఈ తెల్లవారుజామున 5:30 గంటలకు నిర్భయ దోషులు నలుగురికీ ఉరితీత పూర్తయిన తర్వాత నిర్భయ తల్లి ఆశాదేవి విజయ చిహ్నం చూపిస్తూ సంతోషంగా కనిపించారు. దోషులకు ఉరిశిక్ష అమలు జరిగిన వెంటనే తన కుమార్తె ఫొటోను హత్తుకున్నానని ఆశాదేవి ఉద్వేగభరితంగా మాట్లాడారు. తన కుమార్తె లేదని, ఇకపై రాదని పేర్కొన్న ఆమె.. కుమార్తెను కోల్పోయిన తర్వాత తాము పోరాటం ప్రారంభించినట్టు చెప్పారు.
ఇప్పటి వరకు తమ పోరాటం నిర్భయ గురించేనని, ఇకపై ‘మన కుమార్తె’ల కోసం పోరాడతానని చెప్పారు. మొత్తానికి వారికి ఉరిపడిందని ఆశాదేవి పేర్కొన్నారు. ఇదో సుదీర్ఘకాల బాధ అని ఆమె వ్యాఖ్యానించారు. ఇన్నాళ్లకు తమకు న్యాయం లభించిందని ఆనందం వ్యక్తం చేశారు. ఈ రోజును దేశంలోని అందరి కుమార్తెలకు అంకితం ఇస్తున్నట్టు చెప్పారు. భారత ప్రభుత్వానికి, న్యాయవ్యవస్థకు ఆశాదేవి కృతజ్ఞతలు తెలిపారు.