గుజరాత్లోని ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్జీసీ) ప్లాంట్లో ఈ తెల్లవారుజామున భారీ పేలుడు సంభవించింది. సూరత్లోని హజీరా ఆధారిత ఓఎన్జీసీ ప్లాంట్లో రెండు టెర్మినళ్ల వద్ద తెల్లవారుజామున 3.30 గంటలకు ఈ ఘటన జరిగింది. దీంతో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. పేలుడు శబ్దం దాదాపు 10 కిలోమీటర్ల దూరం వరకు వినిపించినట్టు స్థానికులు తెలిపారు.
పేలుడు శబ్దానికి పరిసర ప్రాంత ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ఎగిసిపడుతున్న మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందని అధికారులు పేర్కొన్నారు.