ఏపీ సీఎం వైఎస్ జగన్పై టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమ మరోసారి విర్చుకుపడ్డారు. తిరుమలలో అనాదిగా వస్తున్న ఆచారాలను కాలరాసే హక్కును మీకెవరు ఇచ్చారని ప్రశ్నించారు. డిక్లరేషన్ ఫామ్ను నింపడానికి ఎవరికీ లేని అభ్యంతరం మీకెందుకని నిలదీశారు. జగన్ తీరుతో భక్తుల మనసులు తీవ్రంగా గాయపడ్డాయన్నారు.ముఖ్యమంత్రి పదవిలో ఉన్న మీరే ఆచారాన్ని ధిక్కరించి దరఖాస్తును నింపనంటే ఎలా అని మండిపడ్డారు.
జగన్ డిక్లరేషన్పై సంతకం చేసి సతీసమేతంగా వెళ్లి స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించాలని భక్తులు కోరినట్టు చెప్పారు. శ్రీవారిని దర్శించుకున్నప్పుడు మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం కూడా డిక్లరేషన్ లో సంతకం చేసి, తమ భక్తిభావాన్ని చాటారని ఉమ గుర్తు చేశారు. మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలతో భక్తులు అసహనానికి గురవుతున్నారని దుయ్యబట్టారు.