ఉరి శిక్ష నుంచి తప్పించుకునేందుకు నిర్భయ దోషులు చేసిన కుటిల ప్రయత్నాలేవీ ఫలించలేదు. రోజూ ఏదో ఒక సాకుతో కోర్టులను ఆశ్రయిస్తూ శిక్ష అమలును వాయిదా వేసే ప్రయత్నం చేసిన దోషులు ముఖేశ్ సింగ్, పవన్ గుప్తా, అక్షయ్ ఠాకూర్, వినయ్ శర్మలు.. చట్టపరంగా తమకు ఉన్న అన్ని హక్కులు ఉపయోగించుకున్నారు. చివరికి పటియాలా హౌస్ కోర్టు తీర్పును ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేశారు. నిన్న సాయంత్రం అక్కడా వారికి ఎదురుదెబ్బే తగిలింది. దీంతో ఉరిశిక్షను అమలు చేయాలన్న ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో నిన్న రాత్రి అప్పీలు చేశారు.
జస్టిస్ ఆర్.భానుమతి, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ బొప్పన్నలతో కూడిన ధర్మాసనం దోషుల పిటిషన్ను అర్ధరాత్రి అత్యవసరంగా విచారించింది. దోషులు పెట్టుకున్న పిటిషన్ను కొట్టివేసిన కోర్టు హైకోర్టు తీర్పును సమర్థించింది. దీంతో ఉరిశిక్ష అమలుకు ఉన్న అన్ని అడ్డంకులు తొలగిపోవడంతో తీహార్ జైలు అధికారులు ఈ ఉదయం 5:30 గంటలకు దోషులకు ఉరిశిక్ష అమలు చేశారు.