తూర్పు లడక్ లోని గాల్వన్ లోయ వద్ద చైనా సైనికులతో ఇటీవల జరిగిన ఘర్షణలపై ప్రధాని మోదీ మరోసారి స్పందించారు. గాల్వన్ లోయపై కన్ను పడిన వారికి దీటుగా బదులిచ్చామని తెలిపారు. స్నేహంగా ఎలా ఉండాలో భారత్కు తెలుసని, అలాగే, ఎలా దీటుగా బదులివ్వాలో కూడా తెలుసని వ్యాఖ్యానించారు. అమరవీరుల త్యాగాలను గుర్తు చేసుకున్నారు. సరిహద్దుల వద్ద దేశాన్ని కాపాడే క్రమంలో 20 మంది సైనికులు ప్రాణ త్యాగం చేశారని ఆయన కొనియాడారు.
దేశంలో మనం సమస్యలు లేకుండా జీవించేందుకు సైనికులు తమ ప్రాణాలను పణంగా పెట్టారని చెప్పారు. కరోనా కష్టకాలంలో దేశం స్వావలంబన దిశగా ముందుకు సాగేందుకు పౌరులంతా కృషి చేయాలని మోదీ చెప్పారు. దేశీయ ఉత్పత్తుల వాడకానికే ప్రాధాన్యత ఇవ్వాలని, సవాళ్లను అవకాశాలుగా మలుచుకోవాలని చెప్పారు. కరోనా వ్యాప్తిని అరికట్టడానికి నిబంధనలు పాటించకపోతే ప్రమాదమని తెలిపారు.