ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కొందరు మున్సిపల్ కమిషనర్లపై మండిపడ్డారు. విజయవాడలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ ధనంతో ఫోన్లు కొని, బిల్లులు కట్టుకుంటున్నారని అన్నారు. కానీ మా ఫోన్లకు కమిషనర్లు స్పందించకపోవడం పద్దతికాదని హెచ్చరించారు. వర్షాకాలంలో వ్యాపించే సీజనల్ వ్యాధుల పట్ల అధికారులు దృష్టి సారించాలనీ, బొత్స సూచించారు. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బంది ఉన్నప్పటికీ, ఓ ప్రణాళికతో తాము ముందుకెళుతున్నామని చెప్పారు.
వైఎస్సార్ గృహ నిర్మాణ పథకం కింద అర్హత ఉన్న వారందరికీ ఇళ్లు కేటాయిస్తామని తెలిపారు. ఏపీలో ఎన్నడూ లేనట్లు 4 లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వడం చరిత్రలో నిలిచిపోతుందని వ్యాఖ్యానించారు. 100 రోజుల వైసీపీ పాలనలో గత ప్రభుత్వం చేసిన తప్పులను ప్రక్షాళన చేశామని బొత్స చెప్పారు. ప్రతీ ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు అందించే జలశక్తి కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని పేర్కొన్నారు.