బట్టలు ఉతికేందుకు చెరువుకు వెళ్ళి ఐదుగురు బాలికలు మృతి చెందారు. ఈ విషాద ఘటన మహారాష్ట్రలోని జల్నా జిల్లాలో జరిగింది. భోకార్డన్ సమీపంలోని తలేగావ్వాడీకి చెందిన చిన్నారులు ప్రమాదవశాత్తు చెరువులో మునిగి మృతి చెందారు. గ్రామానికి చెందిన ఆరుగురు బాలికలు బట్టలు ఉతికేందుకు చెరువు వద్దకు వెళ్లారు. ఈ క్రమంలో చెరువులోకి దిగిన ఐదుగురు చిన్నారులు చెరువు పూడికలో చిక్కుకుపోయారు.
గమనించిన స్థానికులు బాలికలను బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే బాలికలు ఐదుగురూ మరణించినట్టు ఫూలంబ్రీ పీహెచ్సీ అధికారులు తెలిపారు. మృతులందరూ ఐదు నుంచి ఏడేళ్లలోపు వారేనని పోలీసులు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.