]టీడీపీని వీడి వైసీపీలో చేరిన ఎమ్మెల్సీ పోతుల సునీత శాసన మండలి ఛైర్మన్ షరీఫ్ పై విమర్శలు గుప్పించారు. తాడేపల్లిలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. పరిపాలన వికేంద్రీకరణ బిల్లుపై శాసన మండలి ఛైర్మన్ అనుసరించిన వైఖరి ప్రజాస్వామ్యాన్ని నవ్వులపాలు చేసేలా ఉందని విమర్శించారు. వికేంద్రీకరణ బిల్లుపై మండలి ఛైర్మన్ వైఖరి ఆక్షేపినీయమని ఈ సందర్భంగా సునీత వ్యాఖ్యానించారు.
ప్రజలకు మేలు చేయాలని సీఎం జగన్ నేతృత్వంలోని ప్రభుత్వం ఈ బిల్లును తీసుకొచ్చిందన్నారు. ఈ విషయాన్ని విస్మరించి టీడీపీ బిల్లును అడ్డుకుందన్నారు. తప్పును సరిదిద్దుకుంటే శాసన మండలిని సీఎం జగన్ కొనసాగించే అవకాశముందని తెలిపారు. ఇదిలావుండగా శాసన మండలి రద్దుకు వైసీపీ ప్రభుత్వం సమాలోచనలు చేస్తున్న విషయం తెలిసిందే. మండలి నిర్వహణకు రూ.60కోట్లు వృథా అవుతున్నాయంటూ ప్రభుత్వం పేర్కొంటోంది.