‘జాతిరత్నాలు’ ఫేమ్ కేవీ అనుదీప్ అందించిన కథతో ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ అనే సినిమా రూపొందుతోంది. శ్రీకాంత్రెడ్డి, సంచిత బసు జంటగా నటించారు. వంశీధర్ గౌడ్, లక్ష్మీనారాయణ పుట్టంశెట్టి దర్శకత్వం వహించారు.
‘సిరి సిరి మువ్వ’, ‘శంకరాభరణం’, ‘సాగర సంగమం’ వంటి చిత్రాలు నిర్మించిన పూర్ణోదయా పిక్చర్స్ ఏడిద నాగేశ్వరరావు వారసులు ఈ సినిమాకు నిర్మాతలు. శ్రీజ ఎంటర్టైన్మెంట్స్, మిత్రవింద మూవీస్ పతాకంపై శ్రీరామ్ ఏడిద సమర్పణలో శ్రీజ ఏడిద ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 2న ఈ సినిమా విడుదల కానుంది.
ఈ క్రమంలో ప్రమోషన్స్ షురూ చేశారు. ఇటీవల ట్రైలర్ విడుదల చేయగా.. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్లో బుధవారం గ్రాండ్గా నిర్వహించారు.
‘ఫస్టు డే ఫస్టు షో’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చిరంజీవి ముఖ్య అతిథిగా వచ్చారు.ఈ సందర్భంగా మాట్లాడిన మెగాస్టార్ చిరంజీవి సినిమా ఇండస్ట్రీ గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.’
సినిమా ఇండస్ట్రీ చాలా గొప్పది. నేను ఇక్కడే ఎదిగాను. మధ్యలో వేరే రంగానికి వెళ్లాను. మళ్లీ తిరిగి ఇక్కడికి వచ్చాక దీని వాల్యూ మరింత తెలిసింది. ఇండస్ట్రీలో సక్సెస్ కావడానికి చాలా మంది ప్రయత్నిస్తుంటారు. దానికి పట్టుదల ఉండాలి. గ్రాంటెడ్ గా తీసుకుంటే ఇండస్ట్రీ కూడా మనల్ని అలానే లైట్ తీసుకుంటుంది. ఇండస్ట్రీకి కొత్త టాలెంట్ రావాలి. అందుకే నేను యంగ్ స్టర్స్ ని సపోర్ట్ చేస్తూ ఉంటాను. చిరంజీవి స్టేచర్ కి చిన్న సినిమాలకు గెస్ట్ గా రావడమేంటని అనుకుంటారు. కానీ ఎవరైనా నన్ను గెస్ట్ గా పిలిస్తే కచ్చితంగా వెళ్తాను. వాళ్ల స్థాయికి దగ్గరగా నేను ఉండడం నాకు సంతోషాన్నిస్తుంది. అయితే కథలను సెలెక్ట్ చేసే విషయంలో కొంచెం జాగ్రత్తగా వ్యవహరించండి.
‘ప్రేక్షకులు థియేటర్లు రావడం లేదనేది అపోహ మాత్రమే. మంచి కంటెంట్ ఉంటే ఆడియెన్స్ తప్పక సినిమాలను ఆదరిస్తారు. దర్శకుడు సినిమా సరిగ్గా తీయకపోతే చాలామంది జీవితాలు తలకిందులవుతాయి. కాబట్టి దర్శకులు మంచి కథలపై దృష్టి సారించాలి. నటీనటుల డేట్స్ క్లాష్ అవుతున్నాయని కంగారు కంగారుగా షూటింగ్ చేయవద్దు. ప్రేక్షకులకు ఏది అవసరమో అదే అందించాలి’ అని చిరంజీవి వ్యాఖ్యానించారు.