కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ తల్లి మరణం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. తల్లిని కోల్పోయిన సోనియా గాంధీకి, వారి కుటుంబానికి సీఎం కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
సోనియాగాంధీ తల్లి పోలా మినో ఆగస్టు 27వ తేదీ (శనివారం) ఇటలీలోని తన స్వగృహంలో మృతి చెందినట్లు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ వెల్లడించారు. పోలా మినో అంత్యక్రియలు ఆగస్టు 30వ తేదీన ముగిసినట్లు జైరాం రమేశ్ తెలిపారు.
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ అనారోగ్యంతో బాధపడుతున్న తన తల్లిని కలవడానికి ఆగస్టు 23న బయలుదేరారు. సోనియా గాంధీ, ఆమె కుమారుడు రాహుల్ గాంధీ, కుమార్తె ప్రియాంక గాంధీ వాద్రా ఇప్పటికే విదేశాల్లో ఉన్నారు.
ఇటలీకి చెందిన సోనియాగాంధీని రాజీవ్ గాంధీ ప్రేమ వివాహం చేసుకున్నారు. రాజీవ్ గాంధీ మరణించిన తరువాత కొన్నాళ్లకు కాంగ్రెస్ పగ్గాలు తీసుకున్న సోనియాగాంధీ.. పార్టీని రెండుసార్లు అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు.
అయితే వయోభారం, అనారోగ్యం కారణంగా కొంతకాలం నుంచి ఆమె పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించడం లేదు. ఇక ప్రస్తుతం దేశంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రోజురోజుకు దిగజారుతుండంతో.. పార్టీ పగ్గాలు గాంధీ కుటుంబయేతర వ్యక్తులకు అప్పగించాలనే డిమాండ్ తీవ్రమవుతోంది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్లో జరిగే పార్టీ ఎన్నికల్లో అలాంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.
కాగా.. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ గత కొన్నేళ్లుగా తమ అమ్మమ్మను కలవడానికి చాలాసార్లు వెళ్లారు. 2020లో రాహుల్ గాంధీ తరచుగా విదేశీ పర్యటనలు చేయడంపై విమర్శలు వచ్చాయి. అయితే సమీప బంధువు అనారోగ్యంతో ఉండటం వల్లే ఇటలీలో ఆయన పర్యటిస్తున్నారని అప్పట్లో పార్టీ పేర్కొంది.