ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అప్పట్లో సంచలనం సృష్టించిన ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే శివేరి సోమలను హతమార్చిన ఘటన పై మావోయిస్టు నేత గేణేష్ వివరణ ఇచ్చారు. ఆదివాసీలకు ద్రోహం చేస్తూ, సామ్రాజ్యవాదులకు ఏజెంట్లుగా మారినందుకే ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే శివేరి సోమలను హతమార్చామని ఏవోబీ స్పెషల్ జోన్ కమిటీ కార్యదర్శి గణేష్ తెలిపారు. ఈ మేరకు ఆయన నుంచి విశాఖ పాత్రికేయ ప్రతినిధులకు ఓ లేఖ అందింది. టీడీపీలో చేరిన తర్వాత అధికారాన్ని అడ్డం పెట్టుకుని కోట్ల రూపాయలు సంపాదించారని లేఖలో పేర్కొన్నారు. ఆదివాసీలపై కక్షగట్టి వారిని 5 నెలలుగా జైల్లో ఉంచి వేధించారని మండిపడ్డారు. ఇప్పటికైనా ఇలాంటి అక్రమ అరెస్టులను నిలిపివేయాలని, లేని పక్షంలో స్థానిక నాయకుల నుంచి రాష్ట్ర స్థాయి నాయకులు తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించారు.