ఏపీ ముఖ్యమంత్రి జగన్ తో నటుడు మంచు విష్ణు కలిశారు. మా అధ్యక్షుడిగా ఎన్నికైనా తర్వాత తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని కలిశారు మంచు విష్ణు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో వైఎస్ జగన్తో విష్ణు భేటీ అయ్యారు.
అనంతరం విష్ణు మీడియాతో మాట్లాడుతూ..తాను సినీ పరిశ్రమ తరపున లేదా హీరోగా మాట్లాడటానికి రాలేదని కేవలం వ్యక్తిగత హోదాలోనే మాట్లాడటానికి వచ్చానని స్పష్టం చేశారు.
సీఎంతో జరిగిన సమావేశంలో చాలా విషయాల గురించి మాట్లాడినట్లు తెలిపారు. అయితే అవి వ్యక్తిగతమైన విషయాలని, మీడియాకు వెల్లడించలేనని తెలిపారు. అలాగే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సమస్యలపై చర్చించినట్లు విష్ణు చెప్పారు.
తిరుపతిలో ఫిల్మ్ స్టూడియో పెడతానని మంచు విష్ణు సంచలన ప్రకటన చేశారు. సినీ పరిశ్రమ రెండు రాష్ట్రాలకు రెండు కళ్లు అన్న ఆయన.. విశాఖకు ఎలా షిఫ్ట్ అవ్వాలి అనే దానిపై ఆలోచిస్తామని విష్ణు తెలిపారు.
కొన్ని అంశాలపై విభేదాలు ఉన్నా సినిమా వాళ్లంతా ఒకే కుటుంబం. విభేదాలను అంతర్గతంగా పరిష్కరించుకుంటాం.సినిమా వాళ్లకు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు రెండు కళ్లు లాంటివి.అందరు తెలుగువాళ్లు మాకు కావాలి.
ఇటీవల సీఎం జగన్ అన్నతో చర్చలకు నాన్న గారిని పిలవలేదనేది దుష్ప్రచారమని పేర్కొన్నారు. ప్రభుత్వం నాన్న గారికి కూడా ఆహ్వానం పంపిందని.. కానీ ఆ ఆహ్వానాన్ని అడ్డుకున్న వారెవరో తనకు తెలుసని సంచలన వ్యాఖ్యలు చేశారు. కానీ ఆ విషయం మేమ్ ఇంటర్నల్గా మాట్లాడుకుంటామని మంచు విష్ణు తెలిపారు.
తనకు సినిమా పరిశ్రమ మద్దతు లేదని ప్రచారం చేయడంలో అర్థం లేదని.. నిజంగానే తనకు మద్దతు లేకపోతే బంపర్ మెజారిటీతో మా అధ్యక్షుడిగా ఎలా గెలుస్తానని మంచు విష్ణు ప్రశ్నించారు.