హిమాచల్ ప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కిన్నౌర్ జిల్లోని రెఖాంగ్ పీయో – సిమ్లా జాతీయ రహదారిపై బుధవారం మధ్యాహ్నం భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. మధ్యాహ్నం 12:45 గంటలకు జరిగిన ఈ ప్రమాదంలో ఒక లారీ, ఆర్టీసీ బస్సుతో పాటు పలు వాహనాలు చిక్కుకుపోయినట్లు అధికారులు గుర్తించారు. ఈ ఘటనలో ఇద్దరు మరణించినట్లు అధికారులు తెలిపారు.
ఒక్కసారిగా భారీ కొండచరియలు విరిగిపడడంతో వాహనాలన్నీ బండరాళ్ల కింద చిక్కుకుపోయాయి. హిమాచల్ ప్రదేశ్ ఆర్టీసీకి చెందిన బస్సులో ఏకంగా 40 మంది ప్రయాణికులు చిక్కుకోగా.. ఇప్పటికి 10 మందిని రక్షించారు. మరో 30 మందిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీసులు(ఐటీబీపీ) సహాయక చర్యలు ప్రారంభించారు.