ఆంధ్రప్రజలను కొడుతున్నారన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటుగా స్పందించారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల మధ్య చిచ్చుపెట్టేలా పవన్ కల్యాణ్ మాట్లాడడం సరికాదన్నారు. కొంతమంది కావాలనే పనిగట్టుకుని దుష్ప్రచారాలు ప్రసారం చేస్తున్నారని అన్నారు. ఆంధ్రాలో మనం కులాలు, మతాలుగా విడిపోయి కొట్టుకుంటుంటే ఆంధ్రా వాళ్లను అలుసుగా భావించే తెలంగాణ వాళ్లు కుల, వర్గ విభేదాల్లేకుండా ఐక్యంగా మనవారిని చితక్కొడుతున్నారని పవన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
పవన్ వ్యాఖ్యలపై కేటీఆర్ ట్విట్టర్లో ఘాటుగా సమాధానమిచ్చారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి దేశంలోని 29 రాష్ట్రాల ప్రజలు తెలంగాణలో చాలా ప్రశాంతంగా జీవిస్తున్నారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో బాధ్యతాయుతమైన ఓ వ్యక్తి తెలుగు రాష్ట్రాల ప్రజల మధ్య చిచ్చు పెట్టేలా మాట్లాడటం సరికాదని పలువురు పవన్కు హితవు పలికారు.