telugu navyamedia
క్రీడలు వార్తలు

చెన్నై దెబ్బకు ప్లే ఆఫ్ సమీకరణాలు అతలాకుతలం..

గెలవాలనే కాంక్షతో మొండిగా ఆడుతోన్న చెన్నై సూపర్ కింగ్స్ అత్యంత ప్రమాదకారిగా మారింది.. విధ్వంసాన్ని రేపుతోంది. మిగిలిన జట్ల ప్లేఆఫ్ అవకాశాలను దారుణంగా దెబ్బకొడుతోంది. ధోనీ సేన దెబ్బకు కోల్‌కత నైట్ రైడర్స్ ప్లేఆఫ్ రేస్ నుంచి దాదాపుగా నిష్క్రమించే పరిస్థితి తలెత్తింది. చెన్నై సూపర్ కింగ్స్‌పై గెలిచి ఉంటే.. ప్లేఆఫ్ అవకాశాలు సజీవంగా ఉంచుకోగలిగి ఉండేది. అలా జరగలేదు.

నేరుగా ప్లేఆఫ్ చేరుకోవాలీ అంటే.. ఏ జట్టుకైనా 16 పాయింట్లు సాధించాల్సి ఉంటుంది. ఆ అవకాశం ఇప్పటిదాకా ఒక్క ముంబై ఇండియన్స్‌కే దక్కింది. కీరన్ పొలార్డ్ సారథ్యంలోని ఆ జట్టు 16 పాయింట్లతో ప్లేఆఫ్ చేరింది. కోల్‌కత నైట్ రైడర్స్ నేరుగా ప్లేఆఫ్ చేరడానికి గల అవకాశాలు ఏ మాత్రం లేవు. ప్రస్తుతం ఆ జట్టు ఖాతాలో మిగిలి ఉన్నది.. ఒక్క మ్యాచ్ మాత్రమే. అందులో గెలిచినా 14 పాయింట్ల వద్దే ఆగిపోతుంది. ప్లేఆఫ్ చేరాలంటే మిగిలిన జట్ల గెలుపోటముల మీద ఆధారపడాల్సిందే.

16 పాయింట్లతో దర్జాగా ప్లేఆఫ్ చేరుకునే అవకాశాలు ప్రస్తుతం రెండు జట్లకు మాత్రమే ఉంది. ఒకటి- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రెండు- ఢిల్లీ కేపిటల్స్. ఈ రెండు జట్ల అకౌంట్‌లో ప్రస్తుతం 14 పాయింట్లు ఉన్నాయి. ఇంకా రెండు మ్యాచ్‌లను చొప్పున ఆడాల్సి ఉంది. ఈ రెండింట్లో ఆ రెండు జట్లు ఏ ఒక్క మ్యాచ్‌లో నెగ్గినా నేరుగా ప్లేఆఫ్‌కు వెళ్లిపోతాయి. ప్లేఆఫ్ చేరడానికి అవసరమైన ఆ రెండు పాయింట్ల కోసం నానా తంటాలు పడుతున్నాయి ఆ రెండు జట్లు కూడా. ఢిల్లీ కేపిటల్స్ వరుసగా మూడు, రాయల్ ఛాలెంజర్స్ రెండు మ్యాచుల్లో ఓడిపోయాయి. ప్లేఆప్ ముంగిట పల్టీ కొడుతున్నాయి. ఇక వరుసగా ఐదు మ్యాచ్‌లల్లో నెగ్గిన పంజాబ్ నిన్న పై ఓడిపోయింది. అయితే ఈ జట్టు మిగిలిన చివరి మ్యాచ్ ను చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడాల్సి ఉంది. ఈ మ్యాచ్ లో చెన్నై ఏం చేస్తుందో అనేది చూడాలి మరి.

Related posts