భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ కు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఫోన్ లో మంతనాలు జరిపారు. 23న సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడనున్న తరుణంలో కేజ్రీవాల్ అఖిలేశ్ యాదవ్ కు ఫోన్ చేశారు. తాజా రాజకీయ పరిణాలమాలపై ఇరువురు నేతలు చర్చించారు. వారి చర్చల వివరాలను సమాజ్ వాదీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ మీడియాకు క్లుప్తంగా వివరించారు.
బీజేపీని అధికారంలోకి రాకుండా ఎలా అడ్డుకోవాలో ఇరువురు నేతలు చర్చించారని తెలిపారు. ఎన్నికల ఫలితాల తర్వాత ఎలాంటి వ్యూహాన్ని అనుసరించాలో చర్చించడం జరిగిందని చెప్పారు. ఉత్తరప్రదేశ్ లోని మొత్తం 80 స్థానాల్లో ఎస్పీ-బీఎస్పీ కూటమికి 60కి పైగా స్థానాలు వస్తాయని సంజయ్ సింగ్ తెలిపారు. కేంద్రంలో బీజేపీ అధికారాన్ని కోల్పోనుందని జోస్యం చెప్పారు.