నూతన రెవెన్యూ చట్టంపై తెలంగాణ సీఎం కేసీఆర్ అసెంబ్లీలో సమాధానమిచ్చారు. ఈ సందర్భం ఆయన మాట్లాడుతూ గతంలో అమలు చేసిన రెవెన్యూ విధానం ఎంతో దురదృష్టకరమైనదని పేర్కొన్నారు. భూములు పంచామని గత పాలకులు చెప్పుకునేవారని, అది లోపభూయిష్టమైన రెవెన్యూ విధానం కారణంగా అస్తవ్యస్తంగా మారిందని తెలిపారు.
సూర్యాపేట మఠంపల్లి భూముల వ్యవహారమే అందుకు ఉదాహరణ అని సీఎం కేసీఆర్ అన్నారు. అక్కడున్నదే 1600 ఎకరాలు అయితే, 9 వేల ఎకరాలకు సర్టిఫికెట్లు ఇచ్చారని వెల్లడించారు. మెదక్ జిల్లా శివంపేటలో 200 ఎకరాల భూమి ఉంటే ఆరేడు వందల ఎకరాలకు సర్టిఫికెట్లు ఇచ్చారని తెలిపారు. ఇలాంటి లోపాలను తొలగించేందుకే నూతన రెవెన్యూ చట్టం తీసుకువస్తున్నామని తెలిపారు.
భూముల పంపకం రాజకీయ చర్యగా భావించినంత కాలం ఇలాంటి తప్పిదాలే జరుగుతుంటాయి. ఓ పేద కుటుంబానికి ఆర్థికంగా ఉపయోగపడేందుకు భూమి పంపకం ఉండాలి. కానీ సర్వే లేకుండా ఇష్టారాజ్యంగా భూములు పంపకం చేయడంతో జనాలు తలలు పగుల కొట్టుకుంటున్నారు. ఇచ్చిన భూమి కంటే సర్టిఫికెట్లే ఎక్కువగా ఉంటున్నాయని తెలిపారు.