పశ్చిమ బెంగాల్ లో వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికల నేపథ్యంలో అధికార తృణమూల్ కాంగ్రెస్ కు, బీజేపీకి మధ్య రాజకీయ పోరాటం తారాస్థాయికి చేరుకొంది. ఈ క్రమంలో పశ్చిమ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ ఓ సభలో మాట్లాడుతూ… కరోనా వైరస్ ఎప్పుడో పోయిందని అన్నారు. కానీ సభలు పెట్టనివ్వకుండా బీజేపీని అడ్డుకునేందుకు సీఎం మమతా బెనర్జీ కావాలనే వైరస్ ఉందంటూ లాక్ డౌన్లు విధిస్తున్నారని ఆరోపించారు.
వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికల నేపథ్యంలో బీజేపీని ప్రజలకు దగ్గర కానివ్వకుండా చేయడమే దీదీ ఎత్తుగడని ఆరోపించారు. రాష్ట్రంలో తమను సభలు, సమావేశాలు జరపనివ్వకుండా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. కానీ తమను ఎవరూ ఆపలేరని దిలీప్ ఘోష్ స్పష్టం చేశారు. ఓవైపు దేశంలో నిత్యం వేల సంఖ్యలో కోవిడ్ కేసులు నమోదవుతున్న సమయంలో కరోనా ఎప్పుడో పోయిందని ఓ రాష్ట్ర బీజేపీ చీఫ్ వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది.