ఏపీని వైసీపీ ప్రభుత్వం మూడు ముక్కలు చేసే ప్రణాళికలు చేస్తున్నట్టు రాష్ట్ర ప్రణాళికా సంఘం మాజీ ఉపాధ్యక్షుడు కుటుంబరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ విధానాలతో ఏపీ.. ఆంధ్ర, రాయలసీమ, ఉత్తరాంధ్రగా విడిపోతుందన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. ఏపీకి మూడు రాజధానులు అంటూ సీఎం చేసిన ప్రకటనపై తీవ్రంగా స్పందించారు. రాజధానిపై సీఎం ప్రకటన బీజేపీకి అవకాశమిచ్చినట్లేనని పేర్కొన్నారు. తెలంగాణలో కేసీఆర్ రెచ్చగొట్టినట్లే.. ఏపీలో జగన్ ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నారని అన్నారు.
రాయలసీమ అభివృద్ధి పేరుతో బీజేపీ గతంలోనే ప్రణాళిక ప్రకటించిందన్నారు. విజయసాయిరెడ్డి సహా వైసీపీ నేతలంతా వైజాగ్లో పెట్టుబడులు పెట్టారని, అందుకే వైజాగ్ రాజధాని అంటున్నారని కుటుంబరావు ఆరోపించారు. కాగా, గంటా శ్రీనివాసరావు, కేఈ కృష్ణమూర్తి రాజకీయ కారణాలతోనే జగన్ ప్రకటనను స్వాగతిస్తున్నారని అన్నారు. సీఎం ప్రకటనపై కేంద్రం స్పందించాలని కోరారు. మూడు రాజధానులకు కేంద్రం అనుమతి ఇస్తుందా? అని ఆయన ప్రశ్నించారు. అధికార వికేంద్రీకరణ వేరు.. కోర్ క్యాపిటల్ వేరు అని కుటుంబరావు వివరించారు. రాజకీయంగా టీడీపీని దెబ్బ తీసేందుకే జగన్ అలాంటి ప్రకటన చేశారని అన్నారు.