తాను ఎవరికి తలొగ్గి పనిచేయలేదని కర్ణాటక అసెంబ్లీలో స్పీకర్ రమేష్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బలనిరూపణ పరీక్షకు సంబంధించి తాను జేడీఎస్-కాంగ్రెస్ పార్టీ సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతు పలుకుతున్నానంటూ బీజేపీ చేసిన ఆరోపణలపై మండిపడ్డారు. తనకు స్పీకర్ పదవి తనకు కొత్తేమీ కాదని రమేష్ కుమార్ చెప్పుకొచ్చారు. తాను స్పీకర్ కుర్చీకి కట్టుబడి పనిచేశాననే తప్ప ఎవరికి తలొగ్గి పనిచేయలేదని చేయబోనని స్పష్టం చేశారు. రాజకీయాల్లో తనకు దివంగత ప్రధాని ఇందిరాగాంధీ అవకాశం కల్పించారని చెప్పుకొచ్చారు.
తాను కాంగ్రెస్ పార్టీ వ్యక్తినే అయినా స్పీకర్ గా చాలా హుందాగా వ్యవహరించానని చెప్పుకొచ్చారు. తన రాజకీయ జీవితంలో ఏనాడు నైతిక విలువలకు తిలోదకాలు ఇవ్వలేదనన్నారు.ఒకవేళ అలాంటి పరిస్థితి నెలకొంటే అప్పటికప్పుడే రాజీనామా చేసేందుకు రెడీగా ఉంటానన్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో తాను రాజీనామా లేఖను జేబులో పెట్టుకుని తిరుగుతున్నట్లు చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా తన జేబులో ఉన్న రాజీనామా లేఖను బీజేపీ శాసన సభాపక్ష నేత యడ్యూరప్పకు చూపించారు.