నేను గతిలేక మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) పార్టీ ఏర్పాటు చేయలేదని ఆ పార్టీ అధ్యక్షుడు కమలహాసన్ స్పష్టం చేశారు. తన తండ్రి శ్రీనివాసన్ ఆకాంక్ష మేరకే తాను రాజకీయాల్లోకి అడుగుపెట్టానని చెప్పారు. నిన్న తన పుట్టిన రోజు సందర్భంగా స్వస్థలం పరమకుడిలో ఏర్పాటు చేసిన తండ్రి శ్రీనివాసన్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో కమల్ పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తండ్రి కోరిక నెరవేర్చడం తనయుడిగా తన బాధ్యతని అన్నారు. తాను రాజకీయాల్లోకి రావడం తమ కుటుంబ సభ్యులు ఎవరికీ ఇష్టం లేదని, ఒక్క నాన్న మాత్రమే కోరుకునే వారని తెలిపారు.
నేను ఐఏఎస్ అధికారిని కావాలని నాన్న కలలుకనే వారు. సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన తర్వాత కూడా ఆయన ఇదే కోరేవారు. కనీసం సాయంత్రం కళాశాలకైనా వెళ్లి చదువుకోమని చెప్పేవారు. కానీ దర్శకుడు బాలచందర్ నాకు పని ఇచ్చాక చదువు ఎక్కలేదు’ అంటూ కమల్ పాతజ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకున్నారు. తనకు చదువు వచ్చా? లేదా? అంటే కచ్చితంగా సమాధానం చెప్పలేనుగాని, నైపుణ్యం మాత్రం ఉందని ధైర్యంగా చెప్పగలనని తెలిపారు. కుటుంబాన్ని ఎలా చూసుకోవాలో నాన్నను చూసి నేర్చుకోవాలన్నారు. హాస్యం కూడా నాన్న నుంచే తనకు అలవడిందని చెప్పారు.