మరోసారి మంత్రి బొత్స సత్యనారాయణ రాజధాని అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే రాజధానిని ప్రకటిస్తుందని ఆయన అన్నారు. ప్రస్తుతం నిపుణుల కమిటీ రాష్ట్రమంతటా పర్యటిస్తోందని వివరిస్తోందని తెలిపిన బొత్స సత్యనారాయణ… నిపుణుల కమిటీ నుంచి నివేదిక వచ్చాక రాష్ట్ర రాజధానిపై ప్రకటన ఉంటుందని అన్నారు. రాజధాని నిర్మాణం కోసం రూ.5,400 కోట్లు ఖర్చయిందని, 90 శాతం పనులు పూర్తయినట్టు ఎవరైనా చెప్పగలరా అని బొత్స సవాల్ విసిరారు.
అమరావతిలో ఎమ్మెల్యేలు, ఎన్జీవోలు, ఐఏఎస్ అధికారుల భవనాలు మినహా మిగతావన్నీ తాత్కాలిక భవనాలేనని బొత్స పేర్కొన్నారు. ఎమ్మెల్యేల భవనాలు 67 శాతం పూర్తయ్యాయని, ఐఏఎస్ అధికారుల భవనాలు 26 శాతం పూర్తయ్యాయని తెలిపారు. నిపుణుల కమిటీ 13 జిల్లాల పర్యటన తర్వాత వారి అభిప్రాయాల ఆధారంగా ఏ భవనం ఎక్కడుండాలో నిర్ణయిస్తామని బొత్స వివరించారు. కమిటీకి 6 వారాల సమయం ఇచ్చామని, ఇప్పటికే కమిటీ రెండుమూడు జిల్లాల్లో పర్యటించిందని బొత్స తెలిపారు.