హరియాణా కోర్టు డేరా బాబా అనుచరురాలు హనీప్రీత్సింగ్కు బెయిల్ మంజూరు చేసింది. అక్టోబర్ 2017 నుంచి అంబాలా జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న ఆమె త్వరలో విడుదల కానున్నారు. ఆధ్యాత్మిక ముసుగులో ఇద్దరు సాధ్వీలను అత్యాచారం చేశారనే కేసులో ఆధ్యాత్మిక గురువు గుర్మీత్ రామ్ రహీం సింగ్ను సీబీఐ కోర్టు దోషిగా తేల్చిన విషయం తెలిసిందే. అనంతరం అతడికి జైలు శిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును వ్యతిరేకిస్తూ ఆయన అనుచరులు పంజాబ్, హరియాణా రాష్ట్రాల్లో అల్లర్లు సృష్టించారు.
2017 ఆగస్టు 25లో జరిగిన అల్లర్లలో దాదాపు 29 మంది మరణించగా, 200 మందికి పైగా గాయాల పాలయ్యారు. ఈ క్రమంలో అల్లర్లను అదుపులోకి తెచ్చేందుకు కేంద్రం నుంచి ఆర్మీని మోహరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కర్ఫ్యూ విధించి అతడి అనుచరులను అరెస్టులు చేశారు. దీంతో ఈ అల్లర్లకు ప్రధాన సూత్రధారి హనీప్రీతేనని తేల్చిన పోలీసులు ఆమెను జ్యుడీషియల్ కస్టడీలోకి తీసుకున్నారు. ఆమెతో పాటు మరో 41 మందిని అరెస్టు చేసి అక్టోబర్ 2017లో అంబాలా జైలుకు తరలించారు.