రాష్ట్ర ప్రభుత్వం బాలికలపై అత్యాచారాల నివారణపై దృష్టి పెట్టిందని హోం మంత్రి సుచరిత చెప్పారు. బాలికలపై అఘాయిత్యాలకు పాల్పడే వారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రులు సుచరిత, వనిత, మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తొలుత మాట్లాడిన హోం మంత్రి సుచరిత.. బాలికలపై అఘాయిత్యాల పెరుగుదలకు గల కారణాలపై అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. దగ్గరి బంధువులే ఎక్కువగా ఇలాంటి ఘాతుకాలకు పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
లైంగిక వేధింపులపై యువతలో అవగాహన కల్పిస్తున్నామని తానేటి వనిత తెలిపారు. అన్యాయం జరిగిన వారు ధైర్యంగా ముందుకు వచ్చి చెప్పే పరిస్థితి కల్పిస్తున్నామన్నారు. ప్రస్తుతం ఉన్న చట్టాలు బలోపేతం చేయాలని భావిస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరూ భయపడేలా చట్టంలో మార్పులు తెస్తామని వాసిరెడ్డి పద్మ చెప్పారు. అత్యాచారాలకు పాల్పడే వారిపై ఫోక్సో చట్టం కఠినంగా అమలు చేస్తామన్నారు. చిన్న పిల్లలకు భరోసా కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.