తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిన్న అర్ధరాత్రి పలు ప్రాంతాల్లో బలమైన ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. పిడుగులు, మెరుపులతో కూడిన వర్షం కారణంగా తమ పంట నీటిపాలైందని రైతులు వాపోతున్నారు. వడగండ్లు, పిడుగులతో పలు జిల్లాల్లో కురిసిన వర్షానికి ముగ్గురు మరణించారు. నిజామాబాద్, మహబూబ్ నగర్, ఆదిలాబాద్, వరంగల్ తదితర ఉమ్మడి జిల్లాల పరిధిలో కురిసిన భారీ వర్షానికి రైతులు తీవ్రంగా నష్టపోయారు. వరంగల్ ఎనుమాముల మార్కెట్ యార్డులో ఆరుబయట ఉంచిన దాన్యం తడిసిపోయింది.
హైదరాబాద్ పరిధిలో గత రాత్రి ఒంటి గంట నుంచి మూడున్నర వరకూ భారీ వర్షం కురిసింది. పలు కాలనీలకు కరెంట్ సరఫరా నిలిచిపోయింది. ఈ ఉదయం రోడ్డుపైకి వచ్చిన వాహన దారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ముఖ్యంగా అమీర్ పేట్, చింతల్ బస్తీ, ముషీరాబాద్, దిల్ సుఖ్ నగర్, చైతన్యపురి, ఉప్పల్, రామాంతపూర్ ప్రాంతాల్లో నీరు రోడ్లపైకి చేరింది. ఆ నీటిని మళ్లించేందుకు జీహెచ్ఎంసీ అధికారులు చర్యలు చేపట్టారు.