చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి ఎవరినీ వదలడం లేదు. తాజాగా కరోనా బారిన పడి బీజేపీకి చెందిన రాజ్యసభ ఎంపీ అభయ్ భరద్వాజ్ మృతి చెందారు. ఆయన గుజరాత్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కరోనాకు చికిత్స పొందుతూ ఆయన మంగళవారం చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో మృతి చెందారు. ఆయనకు కరోనా సోకిన తర్వాత న్యుమోనియా బారిన పడ్డారు. ఆయన ఆరోగ్యం విషమించడంతో లైఫ్ సపోర్ట్ మీద ఆయనకు వైద్యం అందించారు. అయినప్పటికీ ఆయన ఊపిరితిత్తులు దెబ్బతినడంతో మంగళవారం రాత్రి ఆయన మృతి చెందినట్టు ఎంజీఎం అసిస్టెంట్ డాక్టర్ అనురాధ భాస్కరన్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అయితే.. అభయ్ భరద్వాజ్ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోడీ తన సంతాపాన్ని ప్రకటించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. “గుజరాత్ నుంచి రాజ్యసభకు ఎన్నికైన ఎంపీ అభయ్ భరద్వాజ్ గొప్ప న్యాయవాది. ఆయన సమాజ సేవలో ముందంజలో ఉన్నారు. ఆయనకు జాతీయాభివృద్ధి పట్ల మక్కువ ఎక్కువ. ఆయన కుటుంబానికి మరియు స్నేహితులకు నా సంతాపం. ఓ శాంతి” అని మోడీ ట్వీట్ చేశారు.
previous post