ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గత రెండు రోజులుగా ఢిల్లీలో మకాం వేశారు. ఆయన బీజేపీలో చేరనున్నట్టు సమాచారం. నిన్న ఆయన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ తో ప్రత్యేకంగా భేటీ అయి, మంతనాలు జరిపారు. తనతో పాటు మరికొందరు ఎమ్మెల్యేలను కూడా ఆయన తీసుకెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ప్రస్తుతానికి గంటాతో పాటు ఎవరెవరు కమలం గూటికి చేరతారన్న విషయంలో స్పష్టత రాలేదు. పార్టీ మారితే తమపై పడే అనర్హత వేటు, తదనంతర పరిణామాలపై వారు ఆందోళన చెందుతున్నట్టు తెలుస్తోంది. ఢిల్లీలో మకాం వేసిన గంటా శ్రీనివాస్, ఇప్పటికే సుజనా, సీఎం రమేశ్ తదితరులతో కూడా చర్చలు జరిపారు. అతి త్వరలో పార్టీ మార్పుపై గంటా స్వయంగా ప్రకటన చేస్తారని తెలుస్తోంది.