మహారాష్ట్రలోని ఠాణె జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కదులుతున్న రైలులోకి ప్రవేశించిన దుండగులు బీభత్సం సృష్టించారు. ప్రయాణికుల వద్ద నుంచి డబ్బు, నగలు దోచుకోవడమే కాకుండా.. ఓ 20 ఏళ్ల యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
వివార్లాలోకి వెళితే..
లక్నో నుంచి ముంబయికి వెళ్తున్న పుష్పక్ ఎక్స్ప్రెస్లో దుండగులు శుక్రవారం రాత్రి ఈ దారుణానికి పాల్పడ్డారు. ఇగత్పురీ, కాసారా రైల్వే స్టేషన్ మధ్య కొండలపై ప్రయాణించే క్రమంలో రైలు వేగం నెమ్మదించింది. ఆ సమయంలో 8 మంది దుండగులు రైలులోని డీ-2 బోగిలోకి ప్రవేశించారు. మారణాయుధాలను పట్టుకుని 10 నుంచి 20 మంది ప్రయాణికులను దుండగులు బెదిరించారు. వారి ఫోన్లను, నగలను , డబ్బులను లాక్కున్నారు. ఎదురుతిరిగిన ప్రయాణికులపై దాడి చేశారు.
స్లీపర్ కోచ్లో ప్రయాణిస్తున్న 20 ఏళ్ల యువతిపై ఎనిమిది మంది దోపిడీ దొంగలు కత్తులతో బెదిరించి అరగంట పాటు అఘాయిత్యం చేశారు. బాధిత మహిళకు గాయాలయ్యాయి. రైలు కాసర రైల్వే స్టేషన్కు చేరుకోవడంతో ప్రయాణికులు రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలిని వైద్య చికిత్స కోసం తరలించి చికిత్స అందిస్తున్నారు.
అత్యాచారానికి పాల్పడిన నలుగురు నిందితులను అరెస్టు చేశామని పోలీసులు శనివారం తెలిపారు. పరారీలో ఉన్న మరో నలుగురు నిందితుల కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.