దేశ రాజధానిలోనే అంతర్జాతీయ మాదక ద్రవ్యాల ముఠా గుట్టురట్టయింది. ఈ ఆపరేషన్లో భారీ ఎత్తున మత్తు పదార్థాలను సీజ్ చేయడంతో పాటు వాటిని నిర్వహిస్తున్న తొమ్మిది మందిని అరెస్టు చేసినట్లు నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు వెల్లడించారు. అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ముందస్తు సమాచారంతో నిర్వహించిన ఈ ఆపరేషన్లో దిల్లీ అంతటా విస్తరించిన ఈ డ్రగ్ సిండికేట్ నుంచి సుమారు 20 కిలోల కొకైన్ను సీజ్ చేశారు. దిల్లీ, పంజాబ్, ఉత్తరాఖండ్, మహారాష్ట్రల్లో ఉన్న ఈ సిండికేట్కు ఆస్ట్రేలియా, కెనడా, యూఎస్, నైజీరియా, శ్రీలంక, కొలంబియా, మలేషియా సహా పలు దేశాలతో సంబంధాలు ఉన్నాయి.
ఈ ఆపరేషన్లో ఐదుగురు భారతీయులు సహా అమెరికా, ఇండోనేషియా జాతీయులు ఇద్దరు, నైజీరియాకు చెందిన ఇద్దరిని అరెస్టు చేశారు. కొకైన్ అంతర్జాతీయ రవాణాకు ఈ సిండికేట్ను నిందితులు గమ్య స్థానంగా ఉపయోగించుకుంటున్నట్లు పోలీసులు చెప్పారు. భారతదేశంలో సీజ్ చేసిన మాదకద్రవ్యాల విలువ అంతర్జాతీయంగా రూ.100కోట్లు ఉంటుందని.. ఈ ముఠా నుంచి సీజ్ చేసిన మొత్తం మాదకద్రవ్యాల విలువ రూ.1300 కోట్లు ఉంటుందని చెప్పారు. అటు ఆస్ట్రేలియాలోనూ అధికారులు నిర్వహించిన మాదకద్రవ్యాల వ్యతిరేక ఆపరేషన్లో 55కిలోల కొకైన్, 200 కిలోల ఇతర మత్తు పదార్థలను సీజ్ చేసినట్లు సమాచారం.