దేశ వ్యాప్తంగా జరుగుతున్నా ఎన్నికల్లో పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సామగ్రి తరలింపునకు కొన్ని ప్రాంతాల్లో అధికారులు నానా తంటాలు పడుతున్నారు. గురువారం జరిగిన రెండో విడత సార్వత్రిక ఎన్నికల పోలింగ్కు తమిళనాడులోని పలు పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సామగ్రి తరలింపునకు గాడిదలు వినియోగించవలసి వచ్చింది.
రాష్ట్రంలోని ధర్మపురి, దిండిగల్, ఈరోడ్, నమక్కల్, థేని తదితర జిల్లాల్లోని మారుమూల కొండ ప్రాంతాలకు సరైన రవాణా సౌకర్యం లేకపోవడం, ఎత్తయిన కొండప్రాంతాల్లో పోలింగ్ బూత్లు ఉండడంతో ఈవిఎంలను గాడిదలవీపుకు కట్టి, సిబ్బంది కాలినడకన ఆయా కేంద్రాలకు చేరుకున్నారు. ఒకప్పుడు రైతులు, రజకుల వంటి వర్గాల వారు తమ అవసరాల కోసం గాడిదలపై పనిముట్లను తరలించేవారు. ఇందుకోసం ప్రత్యేకంగా వాటిని పెంచుకునేవారు. నేటి ఆధునిక యుగంలో కూడా వాటి సేవలను వినియోగించడం విశేషం.