రాబోయే ఎన్నికల కోసం టికెట్ కేటాయింపులలో అసంతృప్తులు ఇంకా పార్టీలు మారుతూనే ఉన్నారు. తమ పార్టీలో సీటు దక్కలేదని అసంతృప్తితో వేరే పార్టీలో చేరిపోతున్నారు. ఇంతవరకు ఏపీలో ప్రధాన పార్టీలు టీడీపీ-వైసీపీ మధ్య జరిగిన ఈ వలసలు తాజాగా జనసేనలో కూడా మొదలయ్యాయి. ఇటీవలే తూర్పుగోదావరి జిల్లాలోని రామచంద్రపురం టికెట్ ఆశించి భంగపడిన జనసేన నాయకుడు దూడల శ్రీనివాసరావు సహా వివిధ మండలాలకు చెందిన వందలాదిమంది జనసేన కార్యకర్తలు టీడీపీలో చేరారు.
దక్షారామం సాయి మాధవానంద కల్యాణ మండపంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు సమక్షంలో వీరంతా పార్టీ కండువాలు కప్పుకున్నారు. ఈ సందర్భంగా తోట త్రిమూర్తులు మాట్లాడుతూ.. నియోజకవర్గ స్థాయిలో నాయకుల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రతీ సామాజిక వర్గం నుంచి ప్రాతినిధ్యం ఉండేలా కమిటీలు ఏర్పాటు చేస్తానన్నారు. దూడల శ్రీనివాసరావు మాట్లాడుతూ.. చంద్రబాబునాయుడు సమర్థుడైన నాయకుడని కొనియాడారు. ఆయన నాయకత్వం రాష్ట్రానికి అవసరమన్నారు. నియోజకవర్గంపై ఎటువంటి అవగాహన లేని వ్యక్తికి జనసేన టికెట్ ఇచ్చిందని ఆరోపించారు. ఎన్నికల అనంతరం ప్రజలకు అందుబాటులో ఉంటానని బాండు రాసివ్వాల్సిందిగా ఆ అభ్యర్థిని కోరానని, అందుకు ఆయన ససేమిరా అనడంతోనే పార్టీని వీడినట్టు శ్రీనివాసరావు తెలిపారు.