తెలుగు వారి ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు. ఆయన 44 ఏళ్ల పాటు తన నటనతో తెలుగు ప్రజలను ఓలలాడించారు. ఆయన వేయని పాత్ర లేదు. ఇక తెరపై అయితే ఆయన దైవ స్వరూపమే. రాముడి పాత్ర వేస్తే రాముడిగా, కృష్ణుడి పాత్ర వేస్తే కృష్ణుడిగా కనిపించేవారు.
1949లో ‘మనదేశం’ సినిమాతో ఆయన ప్రస్థానం మొదలవగా 1951లో విడుదలైన ‘పాతాళభైరవి ‘ సినిమా ఆయన్ని ఒక స్టార్ గా మార్చింది. ఆ తర్వాత ఆయన జీవితంలో వెనుదిరిగి చూసుకోలేదు. ఆయన సినీ, రాజకీయ జీవితంలో ఎన్నో విశేషాలు అందరికీ తెలిసినప్పటికీ ఆయన సినిమాల్లోకి రాక ముందు, చదువు పూర్తయ్యాక మధ్యలో కొంతకాలం ఏం చేశారు..అనే విషయం ఇప్పటికీ చాలామందికి తెలీదు.
1940లో ఎన్టీఆర్ మెట్రిక్యులేషన్ పూర్తిచేశారు.ఆయనకు 1938లో జనతా స్టూడియో యజమానిగా పేరుపొందిన కోటేశ్వరావుతో పరిచయమైంది. 1940లో కోటేశ్వరరావు అబ్దుల్లా ఇన్ స్టిట్యూట్ లో ఫోటోగ్రఫీలో ట్రైనింగ్ కోసం బొంబాయికి వెళ్లారు. సౌండ్ రికార్డింగ్ లో శిక్షణ పొందేందుకు ఎన్టీఆర్ కూడా ఆయన వెంట వెళ్లారు. 15 రోజుల పాటు క్లాసులకు హాజరైనప్పటికీ ఆ తర్వాత ఎందుకో ఎన్టీఆర్ కు ఆసక్తి తగ్గిపోయింది.
ఆ తర్వాత ట్రైనింగ్ మానేసి బొంబాయి లోని మాతుంగాలో ఆంధ్రా మెస్ ప్రారంభించారు. అయితే ఎన్టీఆర్ తండ్రి లక్ష్మయ్య గారికి ఇది నచ్చలేదు. ఇంటి తిరిగి వచ్చేయాలని ఉత్తరం రాశారు. దాంతో ఎన్టీఆర్ వ్యాపారానికి తెరపడింది. ఒకవేళ ఎన్టీఆర్ వ్యాపారానికి లక్ష్మయ్య అడ్డు చెప్పక ఎన్టీఆర్ ఆ మెస్ అలా నడుపుతూ కొనసాగి ఉంటే దేశానికి ఒక మహోన్నతమైన నటుడు దక్కేవాడు కాదు.
previous post