టిక్ టాక్ లో తన పాటలతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న టిక్ టాక్ సింగర్ గడ్డం రాజు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం తెలిసి ఆయన ఫాలోవర్స్ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
సిద్దిపేట జిల్లా కోడూరు మండలం గంగాపూర్ గ్రామానికి గడ్డం రాజు వ్యవసాయం పొలం వద్ద ఆదివారం ఉదయం చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. చుట్టు పక్కల రైతులు గుర్తించి కుటుంబీకులకు సమాచారం ఇచ్చారు. ‘అక్క రాఖీతో ఇంటికి వస్తే ఇక లేడని ఇక రాడని చెప్పమ్మ’ అనే పాటతో గడ్డం రాజు సోషల్ మీడియాలో మంచి క్రేజ్ సాధించాడు. ఆ తర్వాత టిక్ టాక్ లో అతడు ఎన్నో పాటలు పాడి అభిమానులను సంపాదించుకున్నారు. కాగా టిక్ టాక్ యాప్ ని ఇటీవల భారత్ లో నిషేధించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి అతడు ఇంటి పట్టునే ఉంటున్నాడు. రాఖీ పండగ గొప్ప తనాన్ని చెప్పిన రాజు అనూహ్యంగా రాఖీ పండగ ముందు రోజు ఆత్మహత్య చేసుకోవటంతో అతడి అభిమానులను కలచివేసింది. రాజు మృతితో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు శోకసంద్రంలో మునిగిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.
అతడు ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు దర్యాప్తులో తేలనుంది.