ఏపీలో పలువురు వైసీపీ నేతలు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. హైదరాబాదులోని అపోలో ఆసుపత్రిలో విజయసాయి చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్ పై టీడీపీ నేత దేవినేని ఉమ విమర్శలు గుప్పించారు. వైసీపీ నేతలు అట్టహాసంగా చేపట్టిన కార్యక్రమాల వల్లే కరోనా వ్యాప్తి చెందిందని విమర్శించారు. రాష్ట్రంలో కట్లు తెంచి కరోనాను పోషించిన మీ ప్రజాప్రతినిధులు పక్క రాష్ట్రాల్లోని కార్పొరేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని దుయ్యబట్టారు. ఇదే సౌకర్యాన్ని ప్రజలకు కూడా కల్పించాలి జగన్ గారూ అని డిమాండ్ చేశారు.
గతంలో కరోనా గురించి జగన్ బాధ్యతారహితమైన ప్రకటనలు చేశారని మండిపడ్డారు. పారాసిటమాల్ వేసుకుంటే సరిపోతుంది, బ్లీచింగ్ పౌడర్ చల్లితే పోతుంది, కరోనా ఎవరికైనా వస్తుంది, పోతుంది, కరోనా కేసులు పెరుగుతూ పోతాయి, రాబోయే రోజుల్లో కరోనా రాని వారు ఎవరూ ఉండరని మీరు చెప్పిన మాటలను ఈరోజు నిజం చేసి చూపించారని మండిపడ్డారు.