ఇటీవలే చెన్నై వేదికగా ఐపీఎల్ 2021 మినీ వేలం జరిగిన విషయం తెలిసిందే. ఈ వేలంలో హైదరాబాద్కు చెందిన క్రికెటర్లకు స్థానం దక్కలేదు. అయితే.. దీనిపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఫైర్ అయ్యారు. హైదరాబాద్ ఆటగాళ్లకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిభావంతులకు సరైన ప్రాతినిధ్యం లభించడం లేదని… తెలంగాణ క్రీడాకారులను అంటరాని వాళ్లుగా చూస్తున్నారని మండిపడ్డారు. ఐపీఎల్లో హైదరాబాద్ ఆటగాళ్లకు స్థానం కల్పించకపోవడం దారుణమన్నారు. ప్రతిభావంతులైన క్రీడాకారులకు గుర్తింపు లభించడం లేదని దానం పేర్కొన్నారు. సూరత్లో జరిగిన విజయ్ హజారే ట్రోఫిలో ఆడిన ప్రతిభలేని వారిని ఐపీఎల్లో సెలక్ట్ చేశారని.. హైదరాబాద్ ఆటగాళ్లను ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. తెలంగాణలో అసలు నైపుణ్యం ఉన్న ఆటగాళ్లే లేనట్టుగా వ్యవహరిస్తున్నారని.. హైదరాబాదీ క్రికెటర్లను తీసుకోకుంటే మ్యాచ్ లు జరగనివ్వం దానం నాగేందర్ హెచ్చరించారు. హైదరాబాద్ ఆటగాళ్లు లేకుండా అది హైదరాబాద్ జట్టు ఎలా అవుతుందని.. ఆ ఫ్రాంచైజీ పేరు మార్చుకోవాలని హెచ్చరించారు. హైదరాబాద్ ఆటగాళ్లకు జరుగుతున్న అన్యాయాన్ని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకుపోతానని దానం పేర్కొన్నారు.
previous post
next post