ప్రపంచకప్లో పాక్ పై భారత్ ఆధిపత్యానికి తిరుగులేదంటూ టీమిండియా ఏడోసారీ నిరూపించుకుంది. 2017 చాంపియన్స్ ట్రోఫీకి గట్టిగా బదులు తీర్చుకుంటూ ఆదివారం జరిగిన మ్యాచ్లో డక్వర్త్ లూయిస్ పద్దతిన 89 పరుగుల తేడాతో పాక్ను చిత్తు చేసింది. రోహిత్ శర్మ (140) భారీ శతకం.. కోహ్లీ (77), రాహుల్ (57) హాఫ్ సెంచరీల సహాయంతో ముందుగా బ్యాటింగ్కు దిగిన భారత్ 50 ఓవర్లలో 5 వికెట్లకు 336 పరుగులు చేసింది. ఆమిర్కు మూడు వికెట్లు దక్కాయి. చివర్లో వర్షం కారణంగా పాక్ లక్ష్యాన్ని 40 ఓవర్లలో 302 పరుగులుగా నిర్ణయించారు. కానీ పాక్ ఆరు వికెట్లకు 212 పరుగులే చేసి ఓడింది. ఫఖర్ జమాన్(62), బాబర్ ఆజమ్(48), ఇమాద్ వసీమ్(46 నాటౌ ట్) రాణించారు. కుల్దీప్, విజయ్ శంకర్, హార్దిక్ పాండ్యాలకు రెండేసి వికెట్లు దక్కాయి. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్గా రోహిత్ నిలిచాడు. ఈ మ్యాచ్ మొత్తంలో చాలా రికార్డులు నమోదయ్యాయి. వాటిని ఒకసారి పరిశీలిస్తే…
రికార్డులు :
* వన్డేల్లో రోహిత్కిదే తొలి వేగవంతమైన హాఫ్ సెంచరీ (34 బంతుల్లో). అలాగే పాకిస్తాన్పై వరుసగా రెండు వన్డేల్లో సెంచరీలు చేసిన తొలి భారత బ్యాట్స్మన్ రోహిత్. గత ఆసియా కప్లో అతడు 111 రన్స్ చేశాడు.
* భారత్-పాకిస్థాన్ మ్యాచ్లో అత్యధిక స్కోరు చేసిన తొలి బ్యాట్స్మన్ (140) రోహితే. కోహ్లీ (107), సయీద్ అన్వర్ (101) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
* ఈ ప్రపంచకప్లో రోహిత్కు ఇది రెండో సెంచరీ. ఓవరాల్గా ఈమెగా టోర్నీలో ఇతనికిది మూడో శతకం. గత టోర్నీ (2015లో)లో బంగ్లాపై సెంచరీ కొట్టాడు.
* కోహ్లీ తర్వాత ప్రపంచకప్లలో పాక్పై సెంచరీ చేసిన రెండో భారత బ్యాట్స్మన్ రోహిత్.
* వన్డేల్లో అతి తక్కువ ఇన్నింగ్స్ (203)లో 24 సెంచరీలు చేసిన నాలుగో బ్యాట్స్మన్ రోహిత్. ఈ జాబితాలో ఆమ్లా (142 ఇన్నింగ్స్లో), కోహ్లీ (161), డివిల్లీర్స్ (192).. రోహిత్కన్నా ముందున్నారు.
* వన్డేల్లో రోహిత్ సెంచరీల సంఖ్య 24
* ప్రపంచకప్లో పాక్పై పరుగులపరంగా భారత్కిదే అత్యధిక విజయం.
* ప్రపంచకప్లో తొలిసారిగా పాక్పై తొలి వికెట్కు సెంచరీ (136) భాగస్వామ్యాన్ని అందించిన రోహిత్-రాహుల్ జోడీ.
* ప్రపంచకప్లో సైమండ్స్ (143 నాటౌట్) తర్వాత పాక్పై అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మన్ రోహిత్ (140).
* ప్రపంచకప్ లో భారత్పై ఏ వికెట్కైనా 100+భాగస్వామ్యాన్ని అందించిన తొలిజోడీ ఫఖర్-బాబర్.