హైదరాబాద్లో దిశ సంఘటనతో అటు తెలంగాణ ప్రభుత్వంతో పాటు ఇటు తెలంగాణ పోలీసుల తీరుపై తీవ్రమైన విమర్శలు వచ్చాయి. కేసీఆర్ సైతం ఢిల్లీలో జాతీయ మీడియా ఇదే అంశంపై అడిగిన ప్రశ్నలకు మొఖం చాటేయడంతో తీవ్ర విమర్శలు వచ్చాయి. అటు దిశ తల్లిదండ్రులు ఆమె మిస్ అయిన రోజు కేసు నమోదు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవరించిన తీరుకు కూడా తెలంగాణ పోలీసులకే మైనస్ అయ్యింది. ఈ విమర్శలు అన్నింటికి ఈ రోజు ఎన్ కౌంటర్తో పోలీసులు చెక్ పెట్టేశారు. పోలీసులు గత రాత్రి సీన్ రి క్రియేషన్ లో భాగంగా నిందితులు పోలీసులపై దాడి చేసి తప్పించుకునేందుకు ప్రయత్నించగా పోలీసులు నిర్దాక్షిణ్యంగా ఎన్ కౌంటర్ చేసేశారు. ఇక దిశ ఎన్కౌంటర్పై సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ శుక్రవారం ఉదయం స్పందించారు. దిశ కేసులో నలుగురు నిందితులు మహ్మద్ ఆరిఫ్, జొల్లు నవీన్, శివ, చెన్నకేశవులును చటాన్ పల్లి బ్రిడ్జి వద్దకు తీసుకువచ్చి కేసు సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తుండగా వారు పారిపోయేందుకు యత్నించారని సీపీ సజ్జనార్ చెప్పారు.
అక్కడితో ఆగని నిందితులు పోలీసులపై రాళ్లతో దాడి చేస్తూ పారిపోయేందుకు ప్రయత్నించారని.. వెంటనే తేరుకున్న పోలీసులు కాల్పులు జరిపారని, ఈ కాల్పుల్లో నిందితులు మరణించారని సజ్జనార్ వెల్లడించారు. పట్టపగలు కేసు రీకన్స్ట్రక్షన్ చేసేందుకు యత్నిస్తే ప్రజలే దాడి చేస్తారనే అనుమానంతో పోలీసులు అర్దరాత్రి దర్యాప్తు కోసం నిందితులను చటాన్ పల్లి వద్దకు తీసుకువచ్చామని కూడా ఆయన చెప్పారు. ఎన్కౌంటర్ తో ప్రజల నుంచి హర్షాతిరేకాలు వ్యక్త మవుతున్నాయి. ఈ ఎన్ కౌంటర్ ఘటన గురించి పూర్తి సమాచారాన్ని పోలీసులు ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు సమర్పించనున్నారు. ఎన్కౌంటర్ ఆధారాలను పోలీసులు కోర్టుకు నివేదించనున్నారు.