కరోనాపై కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది.దేశవ్యాప్తంగా ప్రజలకు ఉచితంగా కరోనా వ్యాక్సిన్ బూస్టర్ డోసు పంపిణీ చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది..18 నుంచి 59 ఏళ్ల మధ్య వయసు కలిగిన వారందరికీ ఉచితంగా బూస్టర్ డోస్ను అందించనున్నారు. జూలై 15 నుంచి 75 రోజుల పాటు మూడో డోస్ కూడా ఉచితంగా వేయనున్నారు.
భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్ల అవుతున్న సందర్భంగా నరేంద్ర మోదీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా బూస్టర్ డోస్ ఉచిత పంపిణీకి శ్రీకారం చుట్టనున్నారు.
మన దేశంలో గత ఏడాది జనవరి నుంచి కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే చాలా మంది మూడు డోసుల టీకా వేసుకున్నారు. రెండు డోసులు కేంద్రమే ఉచితంగా ఇవ్వగా.. మూడో డోస్కు ఎవరికి వారే వేయించుకోవాలి. ఐతే ఇకపై అది కూడా ఉచితంగానే ఇవ్వనున్నారు.
మన దేశంలో ఇప్పటి వరకు 199 కోట్లకు పైడా డోసుల కరోనా వ్యాక్సిన్ వేశారు. ప్రతిరోజూ 11 లక్షల మందికి పైగా టీకాలు అందిస్తున్నారు. మూడో డోసు ఉచితంగానే వేయనుండడంతో.. వ్యాక్సినేషన్ మరింత ఊపందుకోనుంది.
ప్రస్తుతం దేశంలో రోజువారి 15వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు వస్తున్నాయి. మంగళవారం 15,447 కొత్త కేసులు నమోదయ్యాయి. 16,906 మంది కోలుకోగా.. 45 మంది మరణించారు. ప్రస్తుతం మనదేశంలో 1,32,457 కరోనా యాక్టివ్ కేసులున్నాయి