లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రోజు రోజుకు దిగజారిపోతుంది. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు పార్టీనీ వీడి టీఆర్ఎస్లో చేరుతామని ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా కొల్లాపూర్కు చెందిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి బుధవారం సీఎం కేసీఆర్తో భేటీ అయ్యారు. హర్షవర్ధన్ రెడ్డి కూడ టీఆర్ఎస్లో చేరనున్నారని ప్రచారం సాగుతోంది.
ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆత్రం సక్కు, రేగా కాంతారావు, చిరుమర్తి లింగయ్య, సబితా ఇంద్రారెడ్డి, హరిప్రియానాయక్, వనమా వెంకటేశ్వర రావు, సుధీర్ రెడ్డి, కందాళ ఉపేందర్ రెడ్డిలు టీఆర్ఎస్లో చేరుతామని ప్రకటించారు. తాజాగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి కేసీఆర్తో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకొంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హర్షవర్ధన్ రెడ్డి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుపై విజయం సాధించారు.