చదువు ఇంకా అందని ద్రాక్షలా ఉండటంతో బాధపడుతున్నవారు ఒకపక్క ఉంటె, చదువుకొని అది కూడా గోల్డ్ మెడల్ సాధించి.. చట్ట వ్యతిరేకపనులకు అలవాటుపడిన ఈ ప్రబుద్దుడిని ఏమనాలో.. మీరే తేల్చుకోండి. చదువుకేమో ఎంబీఏలో గోల్డ్ మెడలిస్టు. అదీ ముఖ్యమైన హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్లో. ఏ కంపెనీలోనైనా చేరి ప్రతిభ చాటుకుంటే కనీసం నెలకు లక్ష రూపాయల వేతనం సంపాదించుకోవచ్చు. కానీ తన తెలివి తేటల్ని దొంగతనాలకు వినియోగించాడు. చివరికి పోలీసులకు చిక్కాడు.
అధికారులే విస్తుపోయిన ఈ ఘటన హైదరాబాద్లో చోటు చేసుకుంది, సైబరాబాద్, హైదరాబాద్, రాచకొండ కమిషనరేట్ పరిధిలో గత కొన్నాళ్లుగా ఇళ్లలో చోరీలు జరుగుతున్నాయి. ఈ విధంగా 38 కేసులు నమోదయ్యాయి. దీనితో అప్రమత్తమైన పోలీసులు నిఘా పెట్టారు. వలవేసి ఓ కేటుగాడిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి 800 గ్రాముల బంగారం, లక్షా యాభైవేల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా విచారణలో నిందితుడి గురించి తెలుసుకుని పోలీసులే నోళ్లు వెల్లబెట్టారు. నిందితుడు హెచ్ఆర్ మేనేజ్మెంట్లో ఎంబీఏ పూర్తి చేశాడు. పైగా గోల్డ్మెడల్ కూడా సాధించాడు. మరి ఉద్యోగం వదిలేసి దొంగతనాలను ఎంచుకున్నాడెందుకో అర్ధంకాదు.