పోలవరం కాంక్రీట్ పనుల్లో ప్రపంచ రికార్డు సాధించడం ఓ చారిత్రక ఘట్టమని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. జన్మభూమి-మా ఊరుపై చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. పోలవరం నిర్మాణం మహాయజ్ఞం అని, భగీరథ ప్రయత్నం అని ఈ సందర్భంగా చంద్రబాబు పేర్కొన్నారు. అర్ధరాత్రికే 21వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వేసినట్లు తెలిపారు. 24 గంటల్లో 28వేల క్యూ.మీల కాంక్రీట్ పనులు లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. కానీ ఇప్పటికే 31వేల క్యూ.మీటర్లకు చేరుకున్నామని వెల్లడించారు. ఉయదం10 గంటలకల్లా 35వేల క్యూ.మీ కాంక్రీట్ వేసే అవకాశం ఉందన్నారు.
అసాధ్యాలను సుసాధ్యం చేస్తున్నామని వివరించారు. రికార్డు సాధించడంలో చెమటోడ్చిన అందరికీ సీఎం అభినందనలు తెలిపారు. వేలాది కార్మికులు, ఇంజినీర్లు, సాంకేతిక సిబ్బంది కష్టానికి ఫలితం దక్కిందని ప్రశంసించారు. ఇదే స్ఫూర్తితో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయాలని పిలుపునిచ్చారు. శరవేగంగా పనులు పూర్తి చేస్తున్నందుకు సీబీఐపీ అవార్డు సాధించామని స్పష్టంచేశారు. పోలవరం పనుల్లో పాల్గొన్న వారంతా చరిత్రలో మిగిలిపోతారన్నారు.