కరోనాను తరిమికొట్టేందుకు దేశ పౌరులంతా ఈరోజు రాత్రి 9 గంటలకు 9 నిమిషాలపాటు ఇంట్లోని విద్యుత్ లైట్లు అన్నీ ఆఫ్ చేసి.. కొవ్వొత్తులు, దీపాలు వెలిగించాలని దేశప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే దీనిపై ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త చిన్నజీయర్ స్వామి స్పందించారు. ప్రధాని మోదీ పిలుపును పాటిద్దామని అన్నారు.
దీపాలు వెలిగించడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని పేర్కొన్నారు. “దీపాలు వెలిగించడం ఎంతో మంగళకరం” అని వ్యాఖ్యానించారు. .మంచి నేతితో కానీ, నువ్వుల నూనెతో కానీ దీపాలు వెలిగిస్తే వాతావరణం ఎంతో హాయిగా ఉంటుంది” అని వివరించారు.
దేశానికి ఉపయోగపడే పనులు చేయడంలో అందరం కలసికట్టుగా సాగాలని తెలిపారు. “ప్రధాని మనల్నేమీ కొండలు ఎత్తమనలేదు, కషాయం తాగమని చెప్పలేదు. గుంజీలు తీయమని అంతకన్నా చెప్పలేదు. రాత్రిపూట 9 గంటలకు 9 నిమిషాల పాటు దీపాలు వెలిగించమని చెప్పారు. ఏదైనా అందరితో ఒకే పని చేయించడం ద్వారా మనమంతా ఒక్కటేనన్న స్ఫూర్తి వస్తుందన్నారు.